సత్యపాలుని సత్యమైన శతకము సమీక్ష

రాథోడ్ శ్రావణ్

సత్యపాలుని సత్యమైన శతకము. సమీక్షకులు రాథోడ్ శ్రావణ్*
_________________________
పుస్తక సమీక్ష:-

తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నాయి. అందులో శతకం ఒకటి.వంద పద్యాల సమాహారమునే శతకం అని అంటారు.
తెలుగు భాషా సాహిత్యజ్ఞాన ప్రపంచంలో శతకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.శతక పద్యాలు విద్యార్థుల్లో కంఠస్థ, ఉచ్చారణ పటిమను, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆలోచనను,వివేచనను, విచక్షణను, పెంపొందిస్తుంది.కనుక భాషాభోధనలో శతక పద్యాలకు విశిష్టమైన స్థానం ఉంది.

తెలుగు భాషా మాధుర్యం లోని నవరసాలను ఆస్వాదిస్తూ ఆనందాన్ని పొందే గొప్పకవి గడ్డం సత్యపాల్ రెడ్డి.
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలోని తురాటి, గ్రామంలో శ్రీమతి/శ్రీ గడ్డం రాంరెడ్డి నర్సవ్వ దంపతులకు 26 మే1976 లో జన్మించారు.ఎం.ఏ. తెలుగు సాహిత్యంలో పట్టభద్రులై టి.పి.టి, పూర్తి చేసి ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా సేవలు చేస్తూ, ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా 2012లో తెలుగు అధ్యాపకునిగా నియమింపబడ్డారు.అప్పటి నుండి నాకు మంచి మిత్రులు,
వృత్తి రీత్యా తెలుగు భాష ఉపన్యాసకులుగా విద్యార్థులకు పాఠ్య బోధన చేస్తూ, కరోనా కాలంలో ఇంటర్ విద్యార్థులకు యాదగిరి చానల్లో వీడియో పాఠ్యాంశాలు బోధించారు. ప్రవృత్తి రీత్యా సాహితీ రంగంలో రాణిస్తూ “సత్యసూక్తి” శతకంను రచించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంకితం చేశారు.ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల్లో తెలుగు పాఠ్యాంశాలను రచించి
కళాశాలలో జాతీయ సేవా పథకానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తు, కళాశాల ప్రగతి కోసం కృషి చేశారు.అతని కృషిని గుర్తించిన మాధ్యమిక విద్యాశాఖ ఇటి వలే రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా నుండి ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికచేసి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు గౌరవ, శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి,
హోం శాఖ మాత్యులు గౌ శ్రీ మహమూద్ అలీ చేతుల మీదుగా ఘన సత్కారం అందుకున్నారు.
తను బోధిస్తున్న తెలుగు భాషకు ఒక గౌరవ జ్ఞాపకాన్నివ్వాలని గట్టి సంకల్పంతో సమాజ హితాన్ని కోరుకుంటూ శతకపద్యంలో

అమ్మ భాష తెలుగు యొక్క ప్రాముఖ్యతను, జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రేమను, సమాజంలో జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువు యొక్క స్థానము, చీకు చింతలేని బాల్యము,
నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి సమాజంలో ఉన్న గౌరవము, కష్టకాలంలో అదుకోనే మనిషిలో ఉన్న మానవత్వం, మంచి మాట, ఉపకారం, కులమతాల కంటే గుణానికి ఉన్న విలువలు, గణిత మేధావి శ్రీనివాస రామానుజన్, తెల్లదొరలను గడగడ లాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, జాతి పిత మహాత్మా గాంధీజీ, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డా. బి. ఆర్ అంబేడ్కర్, భక్తకవి బమ్మేర పోతన్న
మొదలగు అన్ని అంశాల పైన ఛందో బద్ధమైన “సత్యసూక్తి” శతకంను ఎంతో ఉత్సాహంతో రచించారు.ఇది సత్యపాలురెడ్డి గారి తొలి రచన కావడం విశేషం.

శతకకర్త పద్యం పట్ల మక్కువను పెంచుకొని, విద్యార్థులకు, పాఠకులకు, తెలుగు భాషాభిమానులకు, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో ఆటవెలది పద్యాలను తీసుకుని నేటి తరానికి ఈ శతకము ద్వారా సమాజంలో పతనమౌతున్న భక్తి,నీతి, ప్రేమ విలువలను
తీసుకురావడానికి, ప్రజలందరూ చైతన్యవంతులు కావాలనే తపనతో, తన యొక్క రచన నైపుణ్యంవలన ప్రయత్నాలు చేస్తు నిర్మల్ జిల్లా పద్యకవులలో ఒకరుగా స్థానం సంపాదించుకున్నారు.

ఆటవెలది పద్య ఛందస్సులో 108 పద్యాలు రచించన సత్యపాల్ రెడ్డి. తెలుగు గురువు గౌ, శ్రీ ,గోవిందుల శ్యాంసుందరాచార్య గారితో ఏర్పడిన గురుశిష్యబంధం వలన పాఠశాల స్థాయి నుంచే తెలుగు పద్యాల పట్ల ఆకర్షితులై తెలుగు పండితులుగా శిక్షణ పొంది.2012లో తెలుగు ఉపన్యాసకులుగా నియమించబడ్డారు.మండలంలో జరిగే
ఉపాధ్యాయ సమావేశాలలో మిత్రులు గంగుల చిన్నన్న గారు వినిపించిన పద్యాలు విని స్ఫూర్తి పొందారు.
సాహితీ మిత్రులు కడారి దశరథ్ ప్రోత్సహింతో శతకం పూర్తి చేసారు.తన తొలి శతకాన్ని దైవస్తుతితో ఆరంభించడం గొప్ప విషయం.

*కొన్ని శతక పద్యాలు పరిశీలిద్ధాం.*
1)
దేశ సేవ వలయు దేశంబు నుండిన
తల్లి ఋణము దీర్చ తరలిరండి
దేశభక్తి లేని దేహాంబు వ్యర్థమే
సత్యపాలు మాట సద్దిమూట

*భావము:-* మనం పుట్టిన మన దేశం కోసం ప్రేమ, విధేయతో, సేవచేసి తల్లిఋణము తీర్చుకోవడానికి అంకితం అవ్వాలి అప్పుడే మనలో నిజమైన దేశభక్తి. లేదంటే భక్తి భావం లేని శరీరం వ్యర్థం అని కవి చక్కగా వర్ణించారు.

2)
అమ్మపలుకు వోలె యమృతము పంచెడి
తేట తెనుగు భాష తీపిమూట
మాటవిన్న తెలుగు మనసంత పులకించు
సత్యపాలు మాట సద్దిమూట

*భావము:-*
కవి తెలుగు భాషను ప్రశంసిస్తూ మధురమైన అమృతాన్ని పంచే అమ్మ భాష తెలుగు జన్మినిచ్చిన తల్లితో సమానము.అటువంటి తిపి మాటలు విని మనస్సును సంతోషం కలుగును అని కవి తెలుగు భాష గురించి చక్కగా చెప్పారు.

3)
కొత్తచిగురు తొడిగి కోయిల రాగాలు
విరులతోడ చెట్లు విందుజేయు
అవని యందు మొందె యామని రాకతో
సత్యపాలు మాట సద్దిమూట

*భావము:-* వసంత ఋతువులో చేట్లు చిగురించి పూవులు పుస్తాయి, కోకిల కూ,కూ అంటూ రాగాలాలపిస్తాయి.వసంత కాలం కొత్త శోభతో అవనిలో చేట్లు కళకళలాడుతూ ఉంటాయి. అని కవి వసంతకాలంలో పుడమితల్లి అందాలను తెలియజేశారు.

4)
పుడమినుండి సిరులు పుట్టించె రైతన్న
జీవకోటికితను జీవమాయె
అన్నదాత యిలను యారాధ్యదైవంబు
సత్యపాలు మాట సద్దిమూట.

*భావము:-*
హలంతో పొలాన్ని దున్ని పంట సిరులు పండించే రైతన్న మన సకల జీవుకోటికి ప్రాణాధారము, అటువంటి అన్నదాత సమస్త మానవాళికి ఆరాధ్యదైవము అని దేశానికి వెన్నెముక అయిన రైతుల కృషిని గుర్తు చేశారు.

ఆటవెలది
నాలుగు పాదములుంటాయి.

1, 3 పాదాలు
మొదట 3 సూర్య గణాలు తరువాత 2 ఇంద్ర గణాలు

2,4 పాదాలు
5 సూర్య గణాలు

ప్రతి పాదములో
నాల్గవ గణం మొదటి అక్షరం యతి

ప్రాసయతి చెల్లును

ప్రాస నియమం లేదు

కవి గడ్డం సత్యపాల్ రెడ్డి గారు శతకంను కడారి దశరత్ గారి ప్రోత్సాహంతో శతకం లిఖిస్తు *సత్యపాలు మాట సద్దిమూట* అనే మకుటంతో శతకం రాయడం అభినందనీయం.

వారి పదపొందిక, రచనా నైపుణ్యం ఎంతో బాగుంది.ఎన్నో విషయాలను సృజించిన యువకవి గడ్డం సత్యపాలుని కలము నుంచి మరింత కావ్యాలు జాలువారాలని వారి కీర్తి దశదిశలా వ్యాపించాలని ఆకాంక్షిస్తున్నాను.

*వెల*:₹=80/-
*ప్రతులకు*
ఉమానీలయం,
ఇ.నెం1- 3-178
ఎ ఎన్ రెడ్డి కాలనీ
నిర్మల్ జిల్లా,-504106
9963668822

*పుస్తక సమీక్షకులు:-*
రాథోడ్ శ్రావణ్ ఉపన్యాసకులు, పుస్తక సమీక్షకులు,
పూర్వ అధ్యక్షులు
ఉట్నూరు సాహితి వేదిక ఉట్నూరు ఆదిలాబాద్ జిల్లా.9491467715.

Get real time updates directly on you device, subscribe now.